రామ్ మందిర్ నిర్మాణం కొరకు చట్టం చేయాల్సిందే! - డా. మోహన్ భగవత్.
అయోధ్య విషయమై విచారణ చేపట్టి ఒక నిర్ణయాన్ని త్వరితంగా తీసుకునేందుకు కోర్ట్ నిరాకరించడం, తమ ప్రాధామ్యాలు వేరని చెప్పడంతో, కోట్లాది హిందువుల మనోభావాలతో ముడిపడిన అయోధ్య శ్రీ రామజన్మభూమి మందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావడం తప్ప మరో మార్గం కనిపించడం లేదని ఆర్ ఎస్ ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ స్పష్టం చేసారు. చట్టం అనివార్యమవుతుందని ఆయన తెలిపారు. కనుక చట్టం చేసే విధంగా ప్రభుత్వంపై ప్రజలంతా కలిసి ఒత్తిడి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు.
విదర్భలో జరిగిన విశ్వహిందూ పరిషత్ హూంకార్ సభలో ఆయన మాట్లాడుతూ 1992 సంవత్సరంలో కూడా అప్పటి ప్రభుత్వం, కోర్ట్ ల వైఖరితో విసుగుచెందిన హిందువులు వివాదాస్పద కట్టడాన్ని కూల్చేశారని ఆయన గుర్తుచేశారు. 2003లో వివాదాస్పద కట్టడం క్రింద పురాతన హిందూ మందిర్ ఉందని భారతీయ పురాతత్వ శాఖ తేల్చిందని, అక్కడ మందిరం ఉండేదని తేలితే, స్థలాన్ని స్వాధీనం చేసుకుని హిందువులకు అప్పగిస్తామని మాట ఇచ్చిన ప్రభుత్వం, ఆ తరువాత ఆ మాట మరచిపోయిందని ఆయన విమర్శించారు.
2010 లో రామనజన్మభూమిలో మందిరం ఉండేదని స్పష్టం చేసిన అలహాబాద్(ప్రయాగరాజ్) హైకోర్ట్ సున్నీ వక్ఫ్ బోర్డ్ పిటిషన్ ను కొట్టివేసినా ఆ స్థలాన్ని ముగ్గురికి కేటాయిస్తూ నిర్ణయాన్ని ప్రకటించిందని తెలిపారు. ఈ నిర్ణయానికి సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టడానికి ఏడేళ్లు తీసుకున్న సుప్రీం కోర్ట్ చివరికి ఏ నిర్ణయం ప్రకటించకుండానే విచారణ వాయిదా వేసిందని విచారం వ్యక్తం చేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చట్టం ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని, ఆ చట్టం కోసం హిందువులందరి ప్రజా ఉద్యమం అవసరమని స్పష్టం చేసారు. 1980 నుండి రామమందిర్ ఉద్యమాన్ని నిర్వహించిన వారే ఇప్పుడు ఈ ఉద్యమాన్ని చేపడతారని ఆయన ప్రకటించారు.
No comments:
Post a Comment